Saturday, July 3, 2010

జీవనకాలమ్

క్రీడ--నీడ

బంతి ఆట వింత ఆట అని ఈ ప్రపంచ కప్పు పోటీలు నిరూపించాయి. క్రీడల నీడలు వింతగా, విడ్డూరం గా, కొండొకచో భయంకరంగా వుంటాయని వింటున్న కథలు చెప్తున్నాయి. బంతి ఆటలో ఎవరు గెలుస్తారన్నది ఒక పోటీ అయితే, ఎవరు గెలుస్తారో తేల్చుకొనే జూదం లక్షలు, కోట్ల రూపాయలతో ప్రపంచమంతా సాగుతున్నది. మొన్న టెన్నిస్ లో మార్టినా నవ్రతిలోవా పదోసారి ఛాంపియన్ కానందుకు ఒకాయన బాధపడుతుంటే, మార్టినెజ్ గెలిచినందుకు నాలుగు లక్షల పందెం గెలిచానని మరొకాయన సంబరపడుతున్నారు.

ఒకరికి వినోదం, మరొకరికి విషాదం అన్న విషయం మిగతా ఆటల్లో ఏమోకాని బంతాట విషయం లో నిజమని రుజువయింది.

ప్రపంచ కప్పు స్థాయికి ఎదిగి, ఆటలో పొరపాటున తన దేశానికే గోల్ చేసి, బాధపడిన కొలంబియా ఆటగాడు ఎస్కోబార్ కు తమ నగరవాసులే తారసపడి, "గోల్ చేసినందుకు థాంక్స్" అని అతన్ని కాల్చి చంపారు. ఇది క్రీడల పట్ల వ్యామోహం లో మనిషి నీచత్వానికి ఈ శతాబ్దానికే మచ్చగా గుర్తుండిపోతుంది. ఎస్కోబార్ మృతికి ప్రపంచమంతా దురపిల్లింది. దేశమంతా అంత్యక్రియలకు కదిలివచ్చింది. నాలుగేళ్ళ పాప అతని దేహం మీద ఓ పువ్వుని వుంచడం అతి హృదయ విదారకమయిన దృశ్యం.

అల్బేనియా గెలవాలని తన పెళ్ళాన్ని, బిడ్డనీ పందెం కాసి ఓడిపోయిన ఓ క్రీడాప్రియుడు మనల్ని అంతగా ఆశ్చర్యపరచడు. మనకి అలాంటి వ్యసనపరులు ధర్మరాజులోనూ, ఆంగ్ల సాహిత్యం లో థామస్ హడ్డీ నవల "మేయర్ ఆఫ్ కాస్టర్ బ్రిడ్జి" లో కథానాయకుడు హెంబెర్డ్ లోనూ కనిపిస్తారు.

బల్గేరియా గెలుపుకు కారణమయిన స్టాయికోవ్ ను ఎలా అదుపులో పెట్టాలి? అని ఇటలీ బంతాట కోచ్ ని ఓ పత్రికా విలేకరి ఆడిగాడట.

"ఏమో అర్థం కావడం లేదు. పిస్తోలు గురి చూపించాలేమో?" అన్నాడట సాబీ అనే ఆ కోచ్. ఇది క్రీడల్లో ఎదుటి ఆటగాళ్ళమీద అతి సరసమయిన సమీక్ష.

ఇదిలా వుండగా ప్రపంచ కప్పు ఛాంపియన్ జర్మనీని తన గోల్ తో ఓడించిన బల్గేరియా ఆటగాడు స్టాయికోవ్ ఆటని చూసి పట్టలేని ఆనందం తో, షాక్ తో స్టాయికోవ్ తల్లికి మూడోసారి గుండెపోటు వచ్చిందిట. 47 ఏళ్ళ ఆ గుండెకాయ గట్టిది. ఆమె ప్రాణానికి ముప్పు రాలేదు.

బల్గేరియా విజయానికి ఉబ్బితబ్బిబ్బయి, ఒళ్ళు మరచి తప్పతాగిన భర్తని, కూరల కత్తితో పొడిచి చంపింది బల్గేరియాలో ఓ మహాసాధ్వి.

ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూసిన మారడోనా ప్రతిభని కళ్ళారా తిలకించక ముందే, మాదక ద్రవ్యాలు వాడిన నేరంకింద అతనిని ఆట నుంచి వెలివేశారు. తన బిడ్డల సాక్షిగా మత్తుపదార్థాలు వాడలేదంటూ కళ్ళ నీళ్ళ పర్యంతం అయి మారడోనా ఇంటికి తరలాడు. మారడోనా ఆటని చూసే సదవకాశాన్ని తమకి పోగొట్టినందుకు ఓ పాకిస్తాన్ లాయరు ప్రపంచకప్పు అధికారుల మీద 25 డాలర్ల నష్టపరిహారానికి కేసు పెట్టాడు. అధికారుల్ని కోర్టుకి హాజరు కావాలంటూ పాకిస్తాన్ కోర్టు తాఖీదు ఇచ్చింది!

అయ్యా, వెర్రి వెయ్యి విధాలన్నారుగాని, బంతాట వెర్రికి 'వెయ్యి' చాలదేమోననిపిస్తున్నది.

స్పెయిన్ ఆటగాడు లూయీ ఎన్రిక్ ముక్కును బద్దలుకొట్టినందుకు ఇటలీ ఆటగాడు మారో టాసోటీకి ప్రపంచకప్పు అధికారులు 40.65 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. ఇంత ఖరీదయిన ముక్కు ఎన్రిక్ కు వుండడం నిజం గా ఈర్ష్య కలిగిస్తున్నది.

(16-07-1994)

==> పదహారు సంవత్సరాల క్రితం ప్రపంచకప్ సాకర్ సందర్భం గా ఆయన వ్రాసిన వ్యాసమిది.

ఇప్పుడు పందాలు కోట్ల లోకీ, బిలియన్లలోకీ పెరిగాయి.

ప్రపంచం ఎస్కోబార్ నీ, ఆట మారడోనా లాంటివాళ్ళని దూరం చేసుకొంది.

ఇప్పుడు ఫేవరిట్ బ్రెజిల్ సెమీ ఫైనల్ లో, నెదర్లాండ్స్ చేతిలో, సెల్ఫ్ గోల్ తో ఓడిపోవడానికి కారణమైన ఫిలిప్ మెలో పరిస్థితి యేమిటో--పాపం!

ఇంకేమైనా మారిందా?

--కృష్ణశ్రీ

Tuesday, March 9, 2010

జీవన కాలమ్

"రబ్బరు" కోపం

ఈమధ్య మా పెద్దబ్బాయి చాలా హుషారుగా వుంటున్నాడు.  వాడి మనస్సులో యేదో మహత్తరమయిన ఆలోచనలు కదులుతున్నప్పుడే ఆ హుషారు తెలుస్తూంటుంది.  రెండ్రోజుల తర్వాత ఆ ఆలోచన సారాంశం నాకర్థమయింది.

"నాన్నా! నువ్వేదయినా ఫ్యాక్టరీ తెరిచే ఆలోచన చెయ్యమన్నావు కదా?"

"అవును"

"బ్రహ్మాండమయిన ఫ్యాక్టరీ తెరిచే ఆలోచన చేశాను"

"యేమిటా ఫ్యాక్టరీ?"

"రబ్బరు బొమ్మల తయారీ"

నాకర్థం కాలేదు. "రబ్బరు బొమ్మలా? అంటే చిన్నపిల్లలు ఆడుకోడానికా?"

"కాదు. పెద్దవాళ్ళు చావగొట్టడానికి లేదా పెద్దవాళ్ళు ఒకరినొకరు చావగొట్టుకోకుండా వుండడానికి ఈ రబ్బరు బొమ్మలు వుపయోగిస్తాయి."

ఇంకా నాకర్థం కాలేదు. అప్పుడు వివరం గా చెప్పుకొచ్చాడు.

ఈ ఆలోచన ప్రథాని ఇందిరాగాంధీ గారిదట.  ఆవిడ కొడుకులు ఒకరినొకరు చిన్నప్పుడు కొట్టుకొంటారనే ఆలోచన ఆ మధ్య మరీ యెక్కువయినప్పుడు, ఆవిడ కంగారుపడి, ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి విదేశాలకి వెళ్ళినప్పుడు ఓ రబ్బరు బొమ్మని కొని తీసుకొచ్చి యిద్దరికీ యిచ్చారట. వాళ్ళకి ఒకరిమీద ఒకరికి కోపం వచ్చినప్పుడు దాన్ని రెండు దెబ్బలు వేస్తే, కోపం తగ్గిపోయేదట.

ఈ ప్రయోగం ఫలించిందని ఆవిడ చెప్పినప్పట్నుంచీ మా వాడి బుర్రలో రైళ్ళు పరిగెత్తాయి.

అసలు ఈ ఆలోచనని మావాడు కాస్త మెరుగుపరిచాడు. యెలాగంటే, నీకు యెవరిమీద కోపం వుందో, వాళ్ళ ఫోటోని ఫ్యాక్టరీకి పంపిస్తే, ఆ ఆకారం బొమ్మ తయారు చేస్తుంది. ఆ లెక్క ప్రకారం పార్లమెంటులో వ్యతిరేక పక్షాలవారందరూ ప్రథాన మంత్రి బొమ్మలు, కొందరు ప్రతిపక్షల బొమ్మలు - ఇలా విరివిగా తయారు చెయ్యచ్చు.  తమకోపాన్ని పార్లమెంటులోనో, శాసన సభలోనో చూపించే బదులు - పార్లమెంటు సభకి వచ్చేముందు ఆ బొమ్మని రెండు దెబ్బలు కొడితే ఆవేశం తగ్గుతుంది. శాసన సభలు - పూజామందిరాల్లాగ మరింత పవిత్రం గా వుంటాయి.

మావాడు చెప్పేదేమిటంటే శాసన సభల్లో ప్రశాంతత దృష్ట్యా గవర్నమెంట్ ఈ రబ్బరు బొమ్మల్ని కొని సరఫరా చెయ్యవచ్చునంటాడు.

ఈ మధ్య కొన్ని రాష్ట్రాల శాసన సభలలో ఇలా చాలా చోట్ల సభ్యులు కోపాలు తెచ్చుకోడానికి కారణం యిలాంటి రబ్బరు బొమ్మలు లేకపోవడమేనని.

అలాగే కాలేజీ ప్రిన్సిపాల్స్ మీద కోపం వున్న విద్యార్థులుంటారు.  ప్రమోషన్ ఇవ్వలేదని బాస్ మీద కోపం వున్న వుద్యోగులుంటారు. ఆస్తి పంచివ్వలేదని తండ్రులమీద కోపం పెంచుకున్న కొడుకులుంటారు.  భర్తలు చెప్పిన మాట వినలేదని కోపం వున్న భార్యలుంటారు (వీళ్ళకీ రహస్యం గా భర్తను రెండు దెబ్బలు కొట్టడానికి సరసమయిన ధరలకి సరఫరా చేస్తాడట)  యెవరికోపం వాళ్ళు తీర్చుకోడానికి ఇలా రబ్బరు బొమ్మలు సహకరిస్తాయి.

కొన్నాళ్ళయాక పొద్దుటే వ్యాయామం లాగా - లేవగానే యెవరి శత్రువుల్ని వాళ్ళు తనివితీరా చావగొట్టి, శాంత మూర్తుల్లాగ, నవ్వుల్తో ఇస్త్రీ చేసిన చలవబట్టల్తో అంతా పవిత్రం గా యిళ్ళలోంచి బయటకి రావచ్చు.  యిలా వాడు చాలా ఆవేశం గా యెన్నో ఆలోచనలు చెప్పాడు.

వినగా ఈ ఫ్యాక్టరీ లాభసాటిగానే వుంటుందనిపించింది.

"నమూనాలేమయినా తయారుచేశావా?" అన్నాను.

"ఉపయోగిస్తుందని అందాకా మా ఆఫీసరు బొమ్మ తయారు చేసుకొన్నాను.  అమ్మకి మీ బొమ్మ చేసిచ్చాను" అన్నాడు ఆనందం తో ఉర్రూతలూగిపోతూ.

(16-3-1984)

(పాశ్చాత్య దేశాల్లో, ఇదివరకటి కాలం లో, యెవరైనా తప్పు చేస్తే, మతగురువులు కొరడా దెబ్బల్ని శిక్షగా విధించేవారట. అదే రాజకుటుంబం లో యెవరైనా తప్పు చేస్తే కొరడా దెబ్బల్ని తినడానికి 'వ్హిప్పింగ్ బాయ్స్ ' అని యేర్పాటు వుండేదట. రాజ కుటుంబీకుడి బదులు ఆ బాయ్స్ ని కొరడాలతో కొట్టేవారన్నమాట. మన దేశం లో కూడా కోపిష్టి రాజుగారి కొడుకులు గురువుగారిదగ్గర చదువుకొంటుంటే, వాళ్ళని దండించాల్సి వస్తే, గురువుగారు రాజు కొడుకుని కాకుండా పక్క కుర్రాణ్ణి కొట్టేవారట!

ఇలాంటి ప్రక్రియని, తన కొడుకు ఆలోచనగా మలిచాడు చమత్కారి గొల్లపూడి! బాగుంది కదూ?

........కృష్ణశ్రీ)

  

Saturday, December 12, 2009

జీవన కాలం



నమ్మి చెడినవారు లేరు

నేనా మధ్య ఓ వూరు షూటింగ్ కి వెళ్ళాను. ఆ వూరులో దాదాపు ప్రతివీధికీ ఓ చిన్న సైజు గుడి వుంది. కొన్నింటిలో మాత్రమే దేవుడున్నాడు. భక్తులు విరివిగా విచ్చేసి దేవుడిని ఆరాధించి పోతున్నారు. 


దైవభక్తి ఇంత తామరతంపరగా వీధివీధులా వ్యాపించినందుకు ఆనందపడ్డాను. అయితే కొన్ని గుడులలో దేవుడి ప్రతిష్ట జరగలేదు. కొన్ని గుడులు పూర్తికాలేదు. దైవకార్యం ఇలా సగం లో ఎందుకు ఆగిపోయిందా అని ఆశ్చర్యం కలిగి, వాకబు చేశాను. ఒకాయన కసిగా ఒంటికాలిమీద లేచాడు. "అయ్యా బాబూ! అయి ఎలక్షన్ గుళ్ళండి--ఆటిలో దేవుడెలా వుంటాడండి--నీతీ జాతీ లేనివాళ్ళు కట్టిన గుళ్ళండి" అని విసుక్కున్నాడు. ఎలక్షన్ గుడికి అర్థం బోధపడలేదు. మరి కొందరిని అడిగాక ఈ పెద్దమనిషి కోపానికి అర్థం తెలిసింది.  


అవన్నీ ఎన్నికలకి నిలబడిన కౌన్సిలర్లు కట్టించిన గుళ్ళట. ఆయా ప్రజా ప్రతినిధులు పౌరులకు అన్నిటికన్న దేవునిపట్లగల ప్రేమని గ్రహించి, తిండిలేకపోయినా ఫరవాలేదని, చెప్పుకోడానికి దేవుడయినా వుండాలని తీర్మానించి గుడులు నిర్మించాలని అనుకొన్నారట. సాధారణం గా ఈ గుడులు ఎన్నికలలో మూడు నాలుగు నెలల ముందుగా ఓటర్లకి అడ్వాన్సులాగ ప్రారంభమవుతాయిట. మరీ మధ్యలో ఎందుకాగిపోయాయి? "అదాండీ--ఎగస్పార్టీ డబ్బిచ్చి కొనేశాడండి. గుడికి వేయించిన ఇటుక, సిమ్మెంటుతో పెరట్లో పశువుల కొట్టాం కట్టించుకొన్నాడండి".  


ఏమయినా నాకీ రాజకీయ నాయకులమీద కోపం రాలేదు. ఏదోవిధం గా ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను రెచ్చగొట్టడం పుణ్యమే అని మన పెద్దలు చెప్పారు. దానికి మన రామదాసు గారే సాక్ష్యం. వారు తానీషా కొలువులో పనిచేస్తూ శాంక్షన్ లేకుండా దేవుడికి గుడీ వగైరా కట్టేశాడు. నగలు కొనేశాడు. తర్వాత కాస్త ఇబ్బందులు పడ్డా పదిమందిలో పేరూ ప్రతిష్టా--అటు పుణ్యం దక్కించుకున్నాడు. ఆయనే "నమ్మిచెడినవారు లేరు" అన్నారు. మరి ఈ రోజున రామ(దాసుని) భక్తులు అక్కడక్కడ వుంటే ఆశ్చర్యం లేదు.  


ఇలా శ్రీరామచంద్రుడిని నమ్మి బాగుపడ్డవాడే మా మిత్రుడు కోటితీర్థాలు. వాడు చదువుకొనేరొజుల్లో అయితే రేషన్ షాపు గుమాస్తానో, లేదా కాబినెట్ మంత్రో అవుతాడని అస్మదాదులం అనుకొనేవాళ్ళం. వాడు ఆ మధ్య ఏ నౌకరీదొరక్క కాస్త పెట్టుబడి ఎలాగో కూడదీసి, వాళ్ళ వూళ్ళోనే ఓ రామకోవెల కట్టించాడు. డబ్బున్నవాడి చుట్టూ కప్పల్లా బంధువులు చేరినట్టు, బెల్లం వున్నచోట చీమలు చేరినట్టు, కోవెల వున్నచోట గవర్నమెంటు ఉద్యోగులు చేరిపోతారు. పాపం వున్నచోట దేవుడు అవతరించడం గతకాలం నాటి మాట. దేవుడు ఉన్నచోట పాపులు అవతరించడం ఈ నాటి మాట.  


డిపార్టుమెంటు ఆఫీసరుగారు వచ్చినప్పుడల్లా గుడి దక్షిణ గోడ పడిపోయినట్టు వ్రాసుకొంటాడు. కోటితీర్థాలు ఆఫీసరుగారికి సదుపాయాలన్నీ చేస్తాడు. దక్షిణం గోడ ఏనాడూ కట్టలేదని ఆఫీసరుగారికి తెలుసు. అసలు కట్టినా శాంక్షన్ డబ్బుల్లో వాటా ఆయనకే దక్కిందని ఆయనకీ తెలుసు. కనక ఏమీ అనుకోరు. కోటితీర్థాలు ఇంట్లో మహా నవేద్యం ఆయనే భోజనం చేస్తారు. అఖండదీపారాధనకి ఆరు డబ్బాల నెయ్యితో, అతనింట్లో పండగలు, పబ్బాలూ అన్నీ గడచిపోతాయి. 


మావాడు ఎప్పుడూ శ్రీరామచంద్రమూర్తి కట్టిన చుట్టు జల్తారు పంచలేవాడతాడు. జరీ కండువాలే ధరిస్తాడు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలను వాళ్ళావిడ సరసమయిన ధరలకి హోటళ్ళకు పంపేస్తుంది. ఆవిడ ఎప్పుడూ సీతాదేవిలాగ అమ్మవారి నగలు ధరించేవుంటుంది. ఈ రోజున భార్యాభర్తలు యిద్దరూ శ్రీరాముని వివాహాన్ని వైభవోపేతం గా నిర్వహిస్తుంటారు. ఈ కాలం లో కూడా తనని నమ్మినవాళ్ళకి--అటు కౌన్సిలర్ల దగ్గరనుంచి గవర్నమెంటు ఉద్యోగాలదాకా ఇతోధికం గా సహాయం చేస్తున్న శ్రీరామచంద్రుడు ప్రత్యక్ష దైవమేకాక మరేమౌతాడు?!  


(01-04-1982)  


దాదాపు 18 సంవత్సరాల క్రితం వ్రాసినప్పటికీ ఇప్పటికీ యేమి మార్పు వచ్చింది? ఇంకా తామరతంపరగా గుళ్ళు కడుతూనే వున్నారు--ఇదివరకు యెవరో పుణ్యాత్ములు కట్టిన గుళ్ళకి వున్న ఆస్తుల్ని హరించి, ధూప దీప నైవేద్యాలకి కూడా కరువు చేసి, శిధిలావస్తలో వున్నా యెవరూ పట్టించుకోవడం లేదు! ఓ కాలవగట్టునో, రోడ్డు ప్రక్కనో ఓ గుడి కట్టేస్తే, ఆపక్కనీ, ఈ పక్కనీ ఓ కిలోమీటరువరకూ సర్కారు భూమిని కబ్జా చేసి, షాపులూ వగైరా కట్టించెయ్యొచ్చు--చందాలు వసూలుచేసి, ఓ వారం రోజులో, తొమ్మిది రోజులో మైకులతో హోరెత్తిస్తూ కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు జరిపించొచ్చు--ఇంకా--గొల్లపూడివారు చెపుతున్నవి అన్నీ జరుగుతూ వుండవచ్చు!  


ముఖ్యం గా, సాయిబాబా గుడి అయితే, సుప్రీం కోర్టు వాటిని ఎండోమెంట్స్ వారు స్వాధీనం చేసుకోవచ్చు అని స్పష్టం గా తీర్పు ఇచ్చినా, 'స్టేలు ' తెచ్చుకొని, చక్కగా అనుభవించొచ్చు! (ఇది నేను విన్నదే సుమండీ!)  


--కృష్ణశ్రీ


Wednesday, November 25, 2009

గుప్త ఙ్ఞానులు

నేను హైస్కూల్లో చదువుకునే రోజూల్లో మా మిత్రుల్లో ఒకడుండేవాడు—వాళ్ళ నాన్నగారు సిగరెట్లు కాల్చేవాడు. అయితే కాల్చే ప్రతి సిగరెట్టు వాళ్ళబ్బాయికి తెలియకుండా కాల్చాలని అతని ప్రయత్నం. అందుకని తెగ ప్రయత్నించి యే పెరట్లోనో, దొడ్లోనో కొడుకు స్కూలుకి వెళ్ళిన తరవాత కాల్చేవాడు. వీలైనప్పుడల్లా కుర్రాడికి సిగరెట్లు కాల్చడం లో నష్టాలు వివరించేవాడు.

ఆయన ఆలోచనల్లా ఒక్కటే—తనకి నిస్సహాయం గా అబ్బిన అలవాటు కుర్రాడికి రాకూడదనే—ఆలోచన మంచిదే కాని ఒకరోజు మావాడి పుస్తకాల బీరువా తెరిచి చూస్తే—అందులో అందమైన సిగరెట్టుపెట్టె, అగ్గిపెట్టె దొరికాయి వాళ్ళ నాన్నకి. వాళ్ళనాన్న కుర్రాడిని తప్పించుకు దొంగతనం గా సిగరెట్టు కాల్చినప్పుడల్లా—కుర్రాడు ధైర్యం గా సిగరెట్టు కాల్చుకోవడం ప్రారంభించాడు.

కాగా అలవాటు ముదిరిన తండ్రి కాస్త దగ్గుతుండేవాడు. “ఈ సిగరెట్ల అలవాటు నీకెప్పటినుంచిరా?” అని తండ్రి అడిగితే, “దగ్గురాకుండా సిగరెట్లు కాల్చడం ఎలాగో కనిపెట్టాను. పొగ ఎక్కువ గొంతులోకి పోకుండా వేళ్ళసందున సిగరెట్టునుంచి, పిడికిలి బిగించి పీల్చాలి” అని తండ్రికి ఓ మార్గం నేర్పాడు కొడుకు. దరిమిలానూ ఇద్దరూ ఒకే సిగరెట్టుపెట్టె లోంచి సిగరెట్టు కాల్చడానికి రాజీపడ్డారు. అప్పుడప్పుడు కొడుకు దగ్గర సిగరెట్లు అప్పు పుచ్చుకునేవాడు తండ్రి.

ఇంత వివరం గా ఎందుకు చెపుతున్నానంటే—మనం చేసేపని మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి గాని, అది పిల్లలకు మంచిదో చెడ్డదో తేల్చుకోవాలిగాని, అది పిల్లల్నుంచి దాచడంవల్ల ఆ “చెడు” వాళ్ళకి అంటదనుకోవడం తెలివితక్కువతనం—పెద్దవాళ్ళకో మంచి, చిన్నవాళ్ళకో మంచి ఉండదుకనుక. కాగా, చిన్నవాళ్ళు మరీ చిన్నవాళ్ళు అని మనం అనుకోవడం పొరపాటు. ఈ మధ్య పార్లమెంటులో పెద్దలకోసం తీసే సినిమాలు పిల్లలు చూసి చెడిపోతున్నారని పెద్దలు వాపోయారు. (చెడిపోయే సినిమాలు పెద్దలయినా ఎందుకు చూడాలో అర్థం కాదు). చర్చ అలా సాగుతున్నప్పుడు ప్రముఖ జర్నలిస్టు రచయిత కుష్వంత్ సింగ్ ఈ సలహా ఇచ్చారు—పెద్దల సినిమాలు (“ఎ” సర్టిఫికెట్) చూసే వయస్సు 16 నుంచి 21 కి మారిస్తే మంచిదని, అంటే అప్పటికి—పిల్లలు బుధ్ధి పెద్దరికాన్ని సంతరించుకొంటుందని—కాని నా ఉద్దేశ్యం—ఈ వయస్సు పరిమితిని పదహారు నుంచి 10కి సవరిస్తే మంచిదని. ఎందుకంటే ఈ కాలం కుర్రవాళ్ళు పదేళ్ళు ముందుకుపోయి ఆలోచిస్తున్నారు. చేసే పనులు చేస్తున్నారు.

నేను నటించిన చిత్రాలు ఇంతవరకు కేవలం రెండే రిలీజయ్యాయి. ఈ మధ్య ఒకింటికి వెళ్ళాను—ఓ పదేళ్ళ అమ్మాయి కిసుక్కున నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది.

నన్నుచూసి—“దటీజ్ సుబ్బారావు వచ్చారు తాతయ్యా” అని చెప్పడం వినవస్తోంది. న్యాయం గా ఆ వయస్సు అమ్మాయి చూడకూడని సినిమలు చూసి చెడిపోతారని ప్రభుత్వం భావించి, “ఎ” సరాటిఫికెట్ ఇచ్చిన సినిమాలు. ఆ తాతయ్యగారు కూడా వారి మనుమరాలు నా సినీమాలు చూసి ఆనందించినందుకు ఎంతో ఆనందించారు.

ఏ దేశమో గుర్తులేదు—టి వి లో పిల్లలు చూడకూడని పెద్దల చిత్రాలు—రాత్రి బాగా ముదిరాక—వేస్తారట—ఉద్దేశ్యం—అప్పటికి పిల్లలు నిద్రపోతారు కనుక నిశ్చింతగా పెద్దలు చూడవచ్చునని. కాని జరిగేదేమిటంటే మందుకొట్టి పెద్దలు నిద్రపోతే—ఆ సినిమాలు చూడడానికి పిల్లలు శ్రధ్ధగా మేలుకొని చూస్తుంటారట.

దాచిన గుప్పెట్లో ఉన్నదేమిటో వెదకాలని ప్రయత్నించడం ప్రతివాడికి సరదా. ఆ గుప్పెటిని బిగించినకొద్దీ చూడాలనే ఉత్సాహం పెరుగుతూంటుంది. ఈ కాలం కుర్రకారుని తక్కువ అంచనా వేస్తున్నారని నా మనవి. సినిమావాళ్ళు బహుశా కుర్రాళ్ళని దృష్టిలో పెట్టుకొనే ఊరుకి రెండుమూడు థియేటర్లలో సినిమాలు రిలీజు చేసుకుంటారు. కుర్రాళ్ళు సినీమాలు చూసి చెడిపోతారని ఇబ్బందిపడే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా—వాళ్ళు ఒక థియేటర్లో చూస్తే—వీళ్ళు మరో థియేటర్లో అదే చిత్రాన్ని చూసి ఆనందిస్తుంటారు.

ఈ మధ్య మా మిత్రుడూ నేనూ ఒక బార్ కి వెళ్ళాం—“ఇదేమిటయ్యా—బయట కుర్చీలుండగా లోపల కూర్చుందామంటారు” అని వెంటబడ్డాను—ఎంత చెప్పినా లోపలే కూర్చుందామంటాడాయన. నేను మరీ బలవంతం చేస్తే విసుగ్గా అన్నాడు: “బయట వద్దయ్యా—అక్కడ మా వాడు కూర్చున్నాడు” అని. పిల్లల్ని చూసి పెద్దలు సిగ్గుపడిపోయే రోజులు వచ్చేశాయి!

(12-11-1992) (సరిగ్గా 17 యేళ్ళ క్రితం)

--ఇప్పుడు—ప్రపంచవ్యాప్తం గా గత పాతికేళ్ళుగా జరిగిన ప్రచారం కొంతలో కొంత ఫలించి—సిగరెట్లు తాగే కుర్రవాళ్ళ సంఖ్య చాలా తగ్గింది.

‘గుప్త ఙ్ఞానం’ పిల్లలకీ కలిగించాలనేవాళ్ళు పెరిగారు—ముఖ్యంగా ‘ఎయిడ్స్’ వచ్చాక, ‘కండోం ’ ల ప్రచారాలు వూపందుకున్నక, పెద్దలకీ తప్పడం లేదు—పిల్లలకి వివరించడం! సిటీల్లోను, పెద్ద పట్టణాల్లోనూ—డేటింగ్, ‘నైట్ క్యాప్’లూ, సహజీవనాలూ మొదలయ్యాయి. (అయినా తక్కువ చదువుకున్నవాళ్ళు ఉన్మాదులుగా మారి, ఆడపిల్లల్ని నరకడం, పొడవడం, యాసిడ్లు పొయ్యడం జరుగుతున్నాయి!)

సినిమాల సంగతికొస్తే, ఇప్పుడు అంత సీను లేదనుకుంటా! 1977 నుంచి అనుకుంటా—ఒక్కో సినిమానీ—పెద్ద సెంటర్లలో మూడేసి, కొంచెం చిన్న సెంటర్లలో రెండేసి, థియేటర్లలో విడుదల చేసి, ఒకే ప్రింట్ తో కథ నడిపించేవారు—‘ఫస్ట్ వీక్ కలెక్షన్లు ‘ దక్కితేనే దక్కడం—రెండోవారం సినిమా ఆడుతుందో లేదో—అని! అలా ఉదాహరణకి విజయవాడలో—వన్ టౌన్లో యే శేషమహల్ కో ఇస్తే, రెండో/మూడో టవున్లో యే అలంకార్ కో, అప్సరాకో ఇచ్చి, లబ్బీ పేటలో యే వెంకటేశ్వరాకో, కనక దుర్గాకో ఇచ్చేవారు! కలెక్షన్లనుబట్టి, ఒక వారమో, రెండువారాలో అయ్యాక, పటమట లో రిలీజు చేసేవారు!

ఇక బార్ల సంగతి—అప్పట్లో కొంత దాపరికం వుండేది—ఇప్పుడు, తండ్రి వేరే బార్ కి వెళ్తే, కొడుకు వేరే పబ్ కి వెళ్ళి, తల్లి ఇంకో పార్టీకి వెళ్ళి—ఇలా అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఇల్లు చేరి, నిద్రపోయి, పొద్దున్నే యేమీ యెరగనట్టూ ‘హాయ్’ చెప్పేసుకుంటున్నారు!

ఇంకేమైనా మారిందా?

విఙ్ఞులే తెలపాలి!
--కృష్ణ శ్రీ

Monday, September 21, 2009

జీవనకాలం


రేపటి దేవుళ్ళు


దువ్వూరి రామిరెడ్డిగారు "పానశాల" అనే పద్యకావ్యంలో ఉమర్ ఖయ్యాం చేత ఇలా అనిపిస్తారు--'మునుపు మసీదువాకిట ముచ్చెలు దొంగిలిపోతి, పాతవై చినిగెను. నేడునున్ వందల చెప్పులకోసమె వచ్చినాడ; నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను, నీవు చచ్చినయెడ వీడిపోయెదవు--చెప్పువోలె నమాజు సైతమున్" అని. 


ఇదివరకోసారి మసీదుకి చెప్పులు దొంగతనం చెయ్యడానికి వెళ్ళాను. అవిప్పుడు చినిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త చెప్పులకోసం మసీదుకు వెళుతున్నాను, కాని నమాజు చెయ్యడానికి కాదు. యెందుకంటే చచ్చాక చెప్పుల్లాగే నమాజు కూడా ఈ లోకం లో వదలి పోతావు--అని తాత్పర్యం.  


దండాలు సోములోరికి, భక్తి చెప్పులమీదికి--అన్న సామెత మనకీ వుంది. మరికొందరికి దేవుడి మీదకన్న వడపప్పుమీద, చక్రపొంగలి మీద వుంటుంది. మరి తిరుపతి వెంకన్న ఖరీదయిన దేవుడు కనుక ఆయన దగ్గర ఖరీదయిన ప్రసాదాలు రిబేటు మీద దొరుకుతాయి. అందుకనే చాలా మంది చవక ధరల్లొ దధ్ధోజనం, చక్రపొంగలి, వడలూ, లడ్డూలూ కొనుక్కొని తిని కడుపు నింపుకొంటారు. దేవుడి ప్రసాదం తిన్నాక పుణ్యం మాటేమో కాని, వెంటనే కడుపు నిండడం కూడా పుణ్యమే కదా! తప్పు లేదు!  


స్వామివారికి కైంకర్యం చేసే ప్రసాదాలు భక్తులు స్వయంగా చేతితోనే తయారు చేయాలని ఆగమ శాస్త్రకారులు నిర్దేశించిన సంప్రదాయం. రోజుకి ఖర్చయ్యే 80 వేల లడ్డూలను యెంతమంది భక్తులు తయారు చేస్తారో! మరెంతమంది ఆరగించి ఆనందిస్తారో! ఈ ప్రసాదాలు తయారు చేసే హక్కు అనాదిగా వస్తున్న మిరాసీదారుల కుటుంబాలున్నాయి.  


దేవుని ప్రసాదం బాగోగులని ప్రశ్నించకూడదని పెద్దలంటారు. దేవుడి ప్రసాదము ఎలావున్నా తినకపోతే కళ్ళు పోవడమో, ఇల్లు కాలిపోవడమో, మరేదో అనర్థం జరుగుతుందనో, ప్రతి కథల్లో, పురాణాల్లో పెద్దలు భయపెట్టారు. ఎలాగూ నోరుమూసుకొని, భక్తితో భక్తులు సేవిస్తారుగదా అని ఆ ప్రసాదాన్ని చిన్నచూపు చూసిన సందర్భాలూ వున్నాయి. 


అలాంటి చిన్నచూపు ఈ మధ్య వెంకటేశ్వరుని లడ్డూలమీద పడిందన్న విషయం తెలిసొచ్చింది. ఏడుకొండలవాని లడ్డూల్లో మేకులూ, బాకులూ లాంటివి ఈ మధ్య ఓ భక్తునికి దొరికాయట--లడ్డూతో పాటు ఒక మేకు కూడా దేవుడు ప్రసాదించాడని, ఈసారి ఏ మిడతో, ఉడతో, రూపాయిబిళ్ళో, బంగారం ముక్కుపుడకో దొరకవచ్చునని ఆ భక్తుడు ఉదారంగా ఆలోచించలేకపోయాడు. మరి స్థలపురాణాల ప్రకారం ఆ భక్తునికి ఎంతో కొంత పాపం వచ్చే వుంటుంది.  


లడ్డూలకు బూజు పట్టిందని మరొకాయన అన్నాడాట. బూజు పడితే దులుపుకొని, 'వెంకట రమణా' అని మూడుసార్లు ఉచ్చరించి మింగెయ్యాలికాని ఫిర్యాదులు చెయ్యడం మహా పాపం. కాగా ఆ బూజులోనే మనిషికి అమరత్వం సిధ్ధించే యోగాన్నో, బూజులాగా ఐశ్వర్యాలు అల్లుకొనే అదృష్టాన్నో దేవుడు ప్రసాదించాడని ఆ భక్తుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడో తెలీదు. కాక ఆ బూజు తమ దగ్గర నిలవ వుండడంవల్ల వచ్చినది కావచ్చు. అయినా నిలవుంటే మనుషులే బూజుపట్టిపోతున్న ఈ రోజుల్లో లడ్డూల గురించి అలా ఆవేదన పడడం ఏమీ బాగోలేదు. దొరికింది మేకు కనక అయ్యగారు ఫిర్యాదు చేశాడుగానీ, లడ్డూలో స్వామివారి వజ్రమో, వైడూర్యమో దొరికివుంటే ఆయన ఫిర్యాదు చేసేవారా? లడ్డూ చుట్టూ నూరురూపాయల నోటువుంటే అలా నిందించేవారా? 


నాకయితే లడ్డూలో మేకులు రావడం అక్కడి వంటవారి అశ్రధ్ధగా కాక, భక్తులకు రాను రాను భక్తి సన్నగిల్లి పోవడానికీ, స్వామివారి ప్రసాదాలపై పవిత్రభావం లుప్తమైపోవడానికీ తార్కాణంగా కనిపిస్తోంది.  


ఆ విషయం బయటపడ్డాక మిరాసీ దారులు కోపంగా పత్రికలకెక్కారుకాని, కాస్త ఖర్చయితే అయిందనుకొని, రోజుకి రెండు మూడు లడ్డూల్లోనైనా--చిన్న బంగారం తునకలూ, స్వామివారి లాకెట్లూ పెట్టవలసింది. అప్పుడు భక్తులు తేలుకుట్టిన దొంగల్లాగ వందలాది లడ్డూలు కొనుక్కొని, రహస్యంగా బంగారాన్ని దాచుకొనేవారు. తేలుమందు కొన్నవారికి జయమాలిని ఫోటో ఉచితం అనో, పదిసార్లు సినిమా చూస్తే పాతచెప్పులు ఉచితం అనో ప్రకటనలు మనం చూస్తూ వుంటాం కదా!--అలా ఈ లోపాన్ని అవకాశం చేసుకోవడం తెలీని అమాయకులుగా నాకు వంటవారు కనిపిస్తున్నారు.  


ఎక్కువ ఔదార్యంగల ప్రముఖ భక్తులు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శంకర్ దయాళ్ శర్మగారు--ఈ వివాదం గురించి బాధపడుతూ మన ఇళ్ళల్లో వంటల్లోనే రాళ్ళూ రప్పలూ వస్తాయి. అంత పెద్ద ఎత్తున చేసేవాటిలో వస్తే సర్దుకుపోవాలి అంటూ సర్ది చెప్పారు. చిన్నవంటల్లో రాయివస్తే పెద్దవంటల్లో బండరాయిరావచ్చు. చిన్నవంటల్లో మేకు వస్తే పెద్దవంటల్లో గంటస్థంభమో, గల్లాపెట్టో వుండొచ్చునన్నదే వారి తాత్పర్యం. ఆమాత్రం భక్తులు అర్థం చేసుకోకపోవడం శోచనీయం.  


లడ్డూల స్థాయిపెంచలేక--రాశినిపెంచుతూ కావలసినన్ని లడ్డూలు తయారుచేయలేక దేవస్థానం వారు ఈమధ్య యిబ్బంది పడుతున్నారట. మనిషికి రెండు లడ్డూలుమాత్రమే రేషన్ గా యిస్తున్నారట. అంటే దైవదర్శనం చేసుకున్నవారికి దేవుడు పదికిలోల పుణ్యం ఇవ్వొచ్చుకాని, దేవస్థానం వారు రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారట. ఈ మధ్య దేవుడిని గంటలో దర్శించి, లడ్డూల కోసం నాలుగు గంటలు క్యూలో నిలబడాల్సి వస్తోందని నిన్ననే స్వామిని దర్శించి వచ్చిన ఒక భక్తుడు చెప్పగా విన్నాను.  


ఈ సమస్య సులువుగా పరిష్కరించే మార్గాలు నాకు తెలుసు. గ్యాస్ పొయ్యిలు పెట్టి శాస్త్రకారుల మూడ్ ను వమ్ముచేసి దేశీయ ప్రమాణాల సంస్థ హయాంలో ప్రసాదాలు తయారుచేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. లడ్డూలలో మరిన్ని మేకులు, రాగినాణాలు, బూజువచ్చేటట్టు చేస్తే భక్తులకు ప్రసాదాలపై మోజు తగ్గుతుంది. లేదా విమానాశ్రయాల్లోలాగా లోహాన్ని గుర్తుపట్టే పరికరాలు లడ్డూలమీద పెట్టి పరిక్షించే పథకం పెట్టాలి.  


(13-9-1985)


(ఇరవైనాలుగేళ్ళక్రితం--ఆప్పటికింకా 'నిత్యాన్నదానపథకం' ప్రారంభం కాలేదు--కొండమీద అన్నిరకాల ప్రాసాదాలూ చవగ్గా దొరికేవి--ఆపం, వడ, దధ్ధోజనం, చక్రపొంగలీ, అరిశె లాంటివి అన్నీ!


ఇక రాళ్ళసంగతేమోగానీ, లడ్డూలు యెక్కువకాలం నిలవ వుంటాయని యెవరో చెపితే, మధ్యలో పటికబెల్లం అచ్చులని వుంచి, లడ్డూలు చుట్టేస్తున్నారు! ఇది ప్రవేశపెట్టిన కొత్తలో యెవరో నాకు లడ్డూ ప్రసాదం ఇవ్వగానే, వెంటనే నోట్లోవేసుకొని నమలబోయేసరికి, పళ్ళూడినంతపనయి, అప్పటినించీ 'తెనాలిరామలింగడి పిల్లి' లా భయపడిపోయి--ఆ లడ్డూ ముక్కని నలుగురిముందూ తినకుండా, దూరం గా తీసుకెళ్ళి, ఓ కాయితమ్మీద జాగ్రత్తగా చిదిపి, లడ్డూనీ, పటికబెల్లం అచ్చుల్నీ వేరుచేసి, విడివిడిగా చప్పరించడం నేర్చుకున్నాను!--కృష్ణశ్రీ)



Saturday, August 22, 2009

'జీవన కాలం'

మనం ఆంధ్రులం
నేను శంబల్పూరు వెళ్ళిన తొలిరోజుల్లో తెలుగుమాట ఎక్కడా వినిపించేది కాదు. ఎక్కడైనా తెలుగు ముఖం కనిపిస్తుందా, తెలుగు మాట వినిపిస్తుందా అని నేనూ మా ఆవిడా తెగ ఆరాటపడిపోయేవాళ్ళం. కొన్నాళ్ళకి అదొక రుగ్మత అయి, మనోవ్యాధి కింద పరిణమించింది. రెండు, మూడు తమిళ కుటుంబాలుండేవి. వాళ్ళంతా చాలా పొత్తుగా వుండేవారు. ఉద్యోగాలతో, అంతస్తులతో నిమిత్తం లేకుండా సాయంకాలాల్లో కలిసి అరవం లో ఆనందం గా కబుర్లు చెప్పుకుంటూండేవారు—వినే ఒరియావాళ్ళు ఈర్ష్యపడేలాగ. మేమూ అలాగే రెండు కుటుంబాలు దొరికితే బాగుండునని వాచిపోయేవాళ్ళం.

ఒకటి, రెండు వారాలు గడిచాక—ఒకాయన పక్కవీధిలోంచి వచ్చాడు. మా ఆవిడా, నేనూ షికారు వెళ్ళడం చూసి తెలుగువాళ్ళమని పోల్చాడట. ఎలాగన్నాను. ఒరియా ఆడవాళ్ళు సాధారణం గా తలలో పువ్వులు పెట్టుకోరు. మనవాళ్ళు విధిగా చేసుకునే అలంకరణనిబట్టి పోల్చాడు.

ఆయన మాతో చెప్పిన మొదటి అంశం: “అయ్యా! మీరు తెలుగువాళ్ళలాగ వున్నారు. ఆ పదో ఇంటాయన కుటుంబరావని—మంచివాడు కాదు. అతనితో మాట్లాడకండి” అని. అదే మా కలయికలో జరిగిన సంభాషణ. మేం తెల్లబోయేలోగా వెళ్ళిపోయాడు.

మరోనాలుగురోజులకు కుటుంబరావుగారొచ్చారు. “బాబూ—ఆ బాబూరావు మీ ఇంటికి రావడం చూశాను. వాడు బరంపురం మనిషి. అప్పులుచేసి బతుకుతాడు. పీనాసి. వాడిని గుమ్మం ఎక్కనివ్వకండి.” చెప్పాడు. మేం నిర్ఘాంతపోయాం. ఇలా ప్రవాసం లో మొదటిసారి ఆంధ్రుల పరిచయం కలిగింది.

నాకింకా యావ పోక, కనిపించిన మరో పాతిక కుటుంబాల్ని చేర్చి, మిత్రుల్ని పోగుచేసి, అందరితో ఉగాదికి ఒక నాటిక వెయ్యడానికి సంకల్పించాను. క్రమం గా కొందరు పెద్దల్లో సణుగుడు వినిపించింది. చివరలో తేలిన విషయం ఏమిటంటే—తెలుగువారు ఒక సంఘం గా ఏర్పడడం కొందరికి ఇష్టం లేదట. “మేం పదేళ్ళుగా ఇక్కడ వుంటున్నాం. ఇంతకాలం అవసరం లేని సంస్థ ఇప్పుడెందుకూ!” అన్నాడాయన.

“అయ్యా! ప్రవాసం వచ్చిన తెలుగువాడికి—పది తెలుగు మొహాలు ఒకచోట కనిపిస్తే సంబరం గా వుంటుంది” అన్నాను.

“సంబరంగా వున్ననాడు వెదుక్కొని కలుస్తాడు. ఆంధ్ర ప్రజలకి సంస్థ ప్రారంభిస్తే—ఒరియా వాళ్ళకి మనమీద అనుమానం వస్తుంది. ఉద్యమం లేవదీసి వెళ్ళగొడతారు” అన్నాడు. ఇంతగొప్ప ఆలోచన నాకు రానందున నిర్ఘాంతపోయాను. మరికొంతమంది “ఇదంతా ఆయన సొంత డబ్బా వాయించుకోడానికి చేస్తున్నాడయ్యా” అన్నారు. మొత్తం మీద ఏ అంధ్రుడూ సంఘీభావాన్ని సరైన దృక్పథం తో అర్థం చేసుకోలేకపోయాడు. ఉగాది నాటకాన్ని చూడవచ్చిన ఒరియా వారు అభినందించారు. ఆంధ్రులు చెవులు కొరుక్కొన్నారు. ఉగాది నాడు ప్రారంభించిన సంస్థ ఆ రోజే మూలబడింది.

మరి తమిళులు ఢిల్లీలో, బొంబాయిలో సంస్థలుగా ఏర్పడి ఎంతో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక కుటుంబం లాగ ఎలా బతుకుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఏమైనా అవసరం లేని విషయం లో ఆవేశం ఆంధ్రుడి జన్మ హక్కు. ఇద్దరు కలిస్తే తప్పనిసరిగా అభిప్రాయభేదం రాకపోతే ఆంధ్రుడికి తోచదు. ప్రతి వ్యక్తి ఒక ద్వీపం. అతనిచుట్టూ చిన్ని నీల తెర వుండాలి—నీతిలోనయినా, అవినీతిలోనయినా. ఉక్కుఫ్యాక్టరీకోసం మనవాళ్ళెందరో చనిపోయారు. పొరుగురాష్ట్రం లో ఫ్యాక్టరీ వచ్చింది! మనకింకా పునాదులు తవ్వుతున్నారు. ఏ విషయం లోనైనా చూడండి—రాష్ట్రానికి సంబంధించిన మంచిపనికి—తమిళనాడులో అన్ని పార్టీలూ ఒకటవుతాయి. మనవాళ్ళు అదేదో వ్యక్తిగతమయిన ప్రలోభం తో కీచులాడుకోకపోతే తోచదు!

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో ముఖ్యమంత్రిగా వుండే చక్రవరి రాజగోపాలాచారిగారు రోడ్ల ఇంజనీర్ల అవినీతిగురించి ఇలా అన్నారట “అరవదేశం లో ఇంజనీర్లు రోడ్లువేసి లాభాలు తింటారు. తెలుగు ఇంజనీర్లు కంకరే తినేస్తారు” అని.

(08-10-1982)

(అప్పటికీ, ఇప్పటికీ, దాదాపు 27 సంవత్సరాలలో యెంతమార్పు వచ్చిందో—నిన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలని టీవీల్లో చూసినవాళ్ళెవరైనా—గుండెలమీద చెయ్యివేసుకొని చెప్పగలరా?.......కృష్ణశ్రీ)

Tuesday, August 11, 2009

జీవన కాలం

స్వతంత్రం వచ్చింది
ఓ కుర్రాడు—ఈదేశానికి స్వతంత్రం వచ్చిన 20 సంవత్సరాలు తర్వాత పుట్టినవాడు ……..కాపీ కొట్టడానికి అవకాశం ఇవ్వలేదని సాటి మితృలతో కలిపి టీచర్ని కొట్టాడు…….తండ్రి కుర్రాడిని కొట్టాడు.
యువకుడు తన మితృలందరిని పోగేసి, ఇంటికి వచ్చి తండ్రిని నిలదీసేసరికి, ఆ తండ్రి……రెండుచేతులూ జోడించి, తనకొడుకుని శిక్షించినందుకు తనకొడుక్కే క్షమాపణ చెప్పాడు.
మరి దేశానికి స్వాతంత్ర్యం రాలేదని యెవరంటారు?
* * *
పెళ్ళయి కాపురం చేస్తున్న దంపతులు రెండో ఆట సినిమా చూసి, ఇంటికి వస్తున్నారు. (ఇది ఇటీవల బొంబాయిలో జరిగిన ఉదంతం కాదు. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఒరిస్సాలో జరిగినది)
—ఇద్దరు…..స్వతంత్రం పుట్టిన పదేళ్ళకే పుట్టినవాళ్ళూ…..ఆమెను తమతో పంపించమని…….భర్త….కొట్టబోతే…..”ఈరాత్రి మాతో గడిపిన భార్యని జీవితామంతా మిగుల్చుకొంటావా……ఇద్దరూ గల్లంతయిపోతారా?” …….భర్త చెయ్యత్తి కొడితే, అతన్ని కొట్టి, చంపకుండా అక్కడే వదిలేసి, యేడుస్తున్న భార్యని తీసుకెళ్ళారు.
ఈ దేశం లో వాళ్ళు పుట్టడానికి పది సంవత్సరాల ముందే స్వాతంత్ర్యం వచ్చింది.
* * *
ఓ రాష్ట్రం లో ఓ పోలీసాఫీసరు, స్వాతంత్ర్యం రావడానికి దాదాపు రెండు దశాబ్దాల అవతల పుట్టినవాడు—ఓ మహానగరం లో నడిబొడ్డున గుడిసెలు వేసుకున్న స్థలం మీద కన్ను వేశాడు……..పదిహేను సంవత్సరాలుగా……ఆస్థలాన్ని యెలా ఖాళీ చేయించాలో తెలియక……..యెవరూ కొనలేదు…….పోలీసాఫీసరుగారి మద్దతుతో చకచకా ఒకాయన కొన్నాడు……తెల్లవారేసరికి గుడిసెలు నేలమట్టమయ్యాయి…..ఎంక్వైరీ అన్నారు……..పెరిగే ప్రభుత్వంలో పెద్దమనుష్యుల్ని నేలమట్టం చేస్తానన్నాడు……..ఎంక్వైరీ ఆగిపోయింది.
ఆఫీసరు ఆనందంతో రెటైరయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు!
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా 35 సంవత్సరాలే అయ్యింది!
13-08-1982